గూడూరు మండలంలో మొసలి కలకలం
సురక్షితంగా పట్టుకొని పాకాల చెరువులో వదిలిన అటవీ శాఖ అధికారులు
తొలిసమయం గూడూరు
మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలం, సీతానగరం గ్రామపంచాయతీ పరిధిలోని భూక్య దస్రు తండాకు వెళ్లే రాళ్ల వాగు బ్రిడ్జి వద్ద గురువారం రాత్రి మొసలి కనిపించడంతో స్థానికుల్లో కలకలం రేగింది.
పొలం పనుల నిమిత్తం తండాకు వెళ్తున్న యువకులు రోడ్డుపై మొసలిని గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా సాహసోపేతంగా వ్యవహరించిన యువకులు చేపల వలల సహాయంతో మొసలిని బంధించారు.
తక్షణమే ఈ విషయాన్ని గూడూరు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుల నుంచి మొసలిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ మొసలిని సురక్షితంగా పాకాల చెరువులో విడిచిపెట్టారు.
సకాలంలో స్పందించిన యువకులను మరియు అటవీ శాఖ అధికారులను గ్రామస్తులు అభినందించారు. ఈ ఘటనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.