నాలుగు నెలల గర్భవతిని కత్తితో హత్య చేసిన భర్త
. జగిత్యాల జిల్లాలో కలకలం
తొలి సమయం డెస్క్ హైదరాబాద్ మర్చి 15:
జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యను భర్త కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ సంఘటన కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో మంగళవారం వేకువజామున జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కోరుట్లకు చెందిన చిత్తరి హరిబాబు, మాదాపూర్కు చెందిన వైష్ణవి (19)తో ఎనిమిది నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం ఇద్దరూ మాదాపూర్లోనే నివసిస్తున్నారు.
హరిబాబు ప్రభుత్వ ఆస్పత్రిలో ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తుండగా, వైష్ణవి యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ రీల్స్ చేస్తోంది. గత కొద్దిరోజులుగా వీరి మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో హరిబాబు, వైష్ణవిపై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఉదయం కుటుంబ సభ్యులు గమనించగా, వైష్ణవి రక్తపు మడుగులో పడి ఉన్నట్లు కనిపించింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.