దుబ్బగూడెం చెలరేగిన మంటలు… అప్రమత్తం అయిన గ్రామస్థులు
అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్
తొలి సమయం కొత్తగూడ 21 ఫిబ్రవరి 2026
గంగారం మండలం దుబ్బగూడెం గ్రామ పంచాయితీ పరిధిలో సోమవారం సాయంత్రం ఆకస్మికంగా అడవి మంటలు చెలరేగి గ్రామస్థులను భయాందోళనకు గురిచేశాయి. గ్రామ సమీపంలోని అడవిలో ప్రారంభమైన మంటలు గాలివేగంతో గ్రామం వైపు వ్యాపించడంతో క్షణాల్లోనే ఆందోళన వాతావరణం నెలకొంది.
మంటలు గ్రామంలోకి ప్రవేశించే పరిస్థితి తలెత్తడంతో గ్రామస్థులు, యువకులు అప్రమత్తమై బిందెలు, బకెట్లతో నీరు పోస్తూ, చెట్ల కొమ్మలతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రమించారు. వారి సమిష్టి కృషితో మంటలు మరింత విస్తరించకుండా అరికట్టగలిగారు. కొంత ఆలస్యం జరిగినట్లయితే గ్రామం మొత్తం మంటల్లో కాలిపోయే ప్రమాదం ఉండేదని స్థానికులు తెలిపారు.
ఈ ఘటనలో సర్పంచ్ పూనెం సంధ్యారాణి–సందీప్, ఉప సర్పంచ్ గోగు పవన్ కళ్యాణ్, గ్రామ సిబ్బంది, ఈసం కాంతారావు, సువర్ణ, పాక లక్ష్మయ్య, కల్తి శేఖర్, పాపారావు తదితర యువకులు, గ్రామస్థులు కలిసి మంటలను ఆర్పడంలో కీలక పాత్ర పోషించారు.
వేసవి కాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడు అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయో తెలియని పరిస్థితి ఉందని, గ్రామానికి సమీపంలోనే శాశ్వత అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
గ్రామస్థుల సమయస్ఫూర్తి, ఐక్యతతో ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.