నరక ప్రాయంగా మారిన మహబూబాబాద్ ఇల్లందు ప్రధాన రహదారి
— వెంటనే మరమ్మత్తులు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలి..
తెలంగాణ విద్యా వ్యవస్థల వేదిక ఉపాధ్యక్షుడు అడ్వకేట్ జంపాల విశ్వ
తొలి సమయం మహబూబాబాద్ జనవరి 25:
భద్రాద్రి కొత్తగూడెం-మహబూబాబాద్ జిల్లా కలెక్టర్లు, ఇల్లందు మహబూబాబాద్ నియోజకవర్గాల శాసనసభ్యులు, ఆర్ అండ్ బి మంత్రివర్యులకు తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు న్యాయవాది జంపాల విశ్వ ప్రెస్ నోట్ ద్వారా ఒక లేఖ రాశారు
లేక సారాంశం ఇలా ఉంది…
మహబూబాబాద్ ఇల్లందు ప్రధాన రహదారి అనేక గుంతలతో వాహన దారులకు నరక ప్రాయంగా మారింది.
ఈ రహదారి అనేకచోట్ల పెచ్చలు పెచ్చలుగా ఊడిపోయి గుంటలు పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ గుంటల మూలంగా వాహనదారులు తమ వాహనాలను గుంటలను తప్పించబోయి కుడి ఎడమ తేడా లేకుండా ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ రహదారిని చూస్తే “కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్” అనే పాత సినిమా పాట గుర్తుకు వస్తుంది. వాహనదారులు గుంటలను తప్పించబోయి రెప్పపాటులో ప్రమాదాల బారి నుండి బయటపడుతున్న ప్పటికీ అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని వాహనాలు నడుపుతున్నారు. కిలోమీటర్ల మేర రోడ్డు మొత్తం పగిలిపోయి, గుంతలు పడి అధ్వానంగా, అసౌకర్యంగా ఉంది. ముఖ్యంగా మహబూబాబాద్ నుండి నామాలపాడు వరకు రోడ్డు పూర్తిగా గుంటలు పడి అతి భయంకరంగా ఉంది.
గత రెండు మూడు సంవత్సరాలుగా సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు కనీస మరమ్మత్తులు కూడా చేయించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. ఏజెన్సీ ప్రాంత రహదారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు. గత నెల రోజులుగా ప్రభుత్వ అధికారులు రోడ్డు భద్రత వారోత్సవాలను నిర్వహిస్తున్నప్పటికీ అధ్వాన పరిస్థితిలో ఉన్న రోడ్లను గురించి మాట్లాడకపోవడం బాధాకరం. భద్రాద్రి కొత్తగూడెం – మహబూబాబాద్ జిల్లా కలెక్టర్లు, ఇల్లందు మహబూబాబాద్ నియోజకవర్గాల శాసనసభ్యులు R&B మంత్రివర్యులు వెంటనే స్పందించి మహబూబాబాద్ ఇల్లందు ప్రధాన రహదారిని మరమ్మతులు చేయించాలని ఈ బహిరంగ లేఖ ద్వారా విజ్ఞప్తి చేస్తూ కోరుతున్నాను.